ధోలావీరా
From Wikipedia, the free encyclopedia
ధోలావీరా గుజరాత్ లోని కచ్ జిల్లా, భచావ్ తాలూకా, ఖదిర్బెట్ వద్ద ఉన్న పురావస్తు క్షేత్రం. ఈ స్థలానికి 1 కిలోమీటరు దక్షిణంగా ఉన్న ధోలావీరా అనే గ్రామం పేరిట ఈ పేరు వచ్చింది. ఈ గ్రామం రాధన్పుర్ నుండి 165 కి.మీ. దూరంలో ఉంది. స్థానికంగా కోటాడ టింబా అని కూడా పిలిచే ఈ స్థలంలో సింధు లోయ నాగరికతకు చెందిన పట్టణ శిథిలాలు ఉన్నాయి.[1] ఈ స్థలం కర్కట రేఖపై ఉంది. హరప్పా క్షేత్రాల్లోని ఐదు పెద్ద వాటిలో ఇది ఒకటి. భారత్లో సింధు లోయ నాగరికతకు చెందిన ప్రముఖ స్థలాల్లో ఒకటి. దీన్ని, సమకాలీన పట్టణాల్లోకెల్లా అత్యంత ఘనమైనదిగా భావిస్తారు.[2] ఇది రాన్ ఆఫ్ కచ్లోని కచ్ ఎడారి వన్యప్రాణి సంరక్షణాలయంలోని ఖదిర్బెట్ దీవిలో ఉంది. 48 హెక్టార్ల చతుర్భుజాకారపు ఈ పట్టణం, ఉత్తరాన మన్సార్, దక్షిణాన మన్హర్ అనే రెండు వాగుల మధ్య నెలకొని ఉంది.[3] ఈ స్థలంలో సా.పూ 2650 నుండి జనావాసాలు ఉన్నాయి. సా.పూ. 2100 నుండి క్షీణించడం మొదలై, కొన్నాళ్లపాటు పూర్తిగా నిర్జనమైపోయి, తిరిగి సా.పూ. 1450 లో జనావాసాలు మొదలయ్యాయి.[4]
ધોળાવીરા (in Gujarati) | |
స్థానం | కచ్ జిల్లా, గుజరాత్ |
---|---|
నిర్దేశాంకాలు | 23°53′10″N 70°13′0″E |
రకం | జనావాసం |
పొడవు | 771 m (2,530 ft) |
వెడల్పు | 617 m (2,024 ft) |
వైశాల్యం | 100 ha (250 acres) |
చరిత్ర | |
పీరియడ్లు | హరప్పను 2 నుండి హరప్పను 5 వరకు |
సంస్కృతులు | సింధు లోయ నాగరికత |
స్థల గమనికలు | |
తవకాల తేదీలు | 1990 నుండి ఇప్పటి వరకు |
స్థితి | శిథిలం |
యజమాని | సార్వజనికం |
ప్రజలకు అందుబాటు | ఉంది |
ఈ స్థలాన్ని 1967-1968 లో భారత పురాతత్వ సర్వే సంస్థ యొక్క అప్పటి డైరెక్టరు జనరల్ జె.పి.జోషి కనుగొన్నారు. ఇది అతి పెద్దవైన హరప్పా క్షేత్రాల్లో ఐదవది. 1990 నుండి పురాతత్వ సర్వే సంస్థ ఇక్కడ తవ్వకాలు జరిపింది. సంస్థ అభిప్రాయం ప్రకారం, "సిందు లోయ నాగరికత మూర్తిమత్వానికి ధోలావీరా కొత్త కోణాలను చేకూర్చింది"[5]
ఇతర హరప్పా క్షేత్రాల్లో పెద్దవి ఇవి: హరప్పా, మొహెంజో దారో, గనేరివాలా, కలిబంగాన్, రూప్నగర్, లోథాల్.