వక్రీభవనం
కాంతి వేర్వేరు యానకాలలో వంగి ప్రయాణించే దృగ్విషయము / From Wikipedia, the free encyclopedia
వక్రీభవనం అనగా తరంగములు ప్రసార యానకంలో వాటి దిశను మార్చుకొనే దృగ్విషయము. వక్రీభవనం అనునది ముఖ్యంగా ఉపరితల దృగ్విషయము. ఈ దృగ్విషయం ముఖ్యంగా శక్తి నిత్యత్వ నియమం, ద్రవ్యవేగం పై ఆధారపడుతుంది. యానకం మారినందువల్ల తరంగం యొక్క దశా వేగం మారుతుంది కానీ దాని పౌనఃపున్యం మారదు. ఇది ఒక తరంగం యానకం నుండి వేరొక యానకం లోనికి 90° లేదా 0° కాని ఏదైనా కోణంలో ప్రయాణించినపుడు ఈ దృగ్విషయాన్ని మనం సాధారణంగా గమనించవచ్చు. కాంతి వక్రీభవనం అనునది అతి సాధారణంగా మనం గమనించే దృగ్విషయం. కానీ ఏ తరంగమైనా ఒక యానకం నుండి వేరొక యానకం లోనికి ప్రవేశించినపుడు వక్రీభవనం చెందుతుంది. ఉదాహరణకు ధ్వని తరంగం ఒక యానకం నుండి వేరొక యానకం లోనికి ప్రవేశించినపుడు లేదా నీటిపై యేర్పడిన తరంగాలు అధిక లోతు గల ప్రదేశం నుండి అల్ప లోతు గల ప్రదేశం వైపుకు ప్రయాణించినపుడు ఈ దృగ్విషయం జరుగుతుంది.
వక్రీభవనం అనునది స్నెల్ నియమం ప్రకారం వివరించబడుతుంది. ఈ నియమం ప్రకారం ఇచ్చిన యానకాల జత, ఒకే పౌనః పున్యము గల తరంగం ఉన్నపుడు పతన కోణం θ1, వక్రీభవన కోణంθ2 ల సైన్ల నిష్పత్తి, వాటి దశా వేగాల నిష్పత్తికి (v1 / v2) రెండు యానకాలలో కూడా సమానంగా ఉంటుంది. లేదా వాటి వక్రీభవన సూచికల విలోమ నిష్పత్తికి (n2 / n1) సమానంగా ఉంటుంది.
సాధారణంగా పతన తరంగం పాక్షికంగా వక్రీభవనం చెంది, పాక్షికంగా పరావర్తనం చెందితే; దాని ప్రవర్తన యొక్క వివరాలు ప్రెస్నెల్ సమీకరణము ద్వారా వివరించవచ్చు.