కంచుయుగం
From Wikipedia, the free encyclopedia
మానవుడు కంచును వాడిన చారిత్రిక కాలాన్ని కంచుయుగం అంటారు. కొన్ని ప్రాంతాల లోని ఆదిమ కాలపు రాతలను, పట్టణ నాగరికతల తొలినాళ్ళను కూడా కంచుయుగం గానే భావిస్తారు. పురాతన సమాజాలను వర్గీకరించడానికి, అధ్యయనం చేయడానికీ క్రిస్టియన్ జుర్గెన్సెన్ థామ్సన్ ప్రతిపాదించిన రాతి-కంచు-ఇనుప అనే మూడు యుగాల వర్గీకరణలో రెండవది కంచుయుగం.
రాగిని కరిగించి, దానికి తగరం, ఆర్సెనిక్ లేదా ఇతర లోహాలను కలిపి కంచును తయారు చేయడం గాని. ఇతర ప్రాంతాలలో తయారైన ఉత్పత్తిని కొనుగోలు చేయడం గానీ చేసిన కాలాన్ని కంచుయుగంగా భావిస్తారు. ఆ కాలం నాటి ఇతర లోహాల కంటే కంచు దృఢమైనది, మన్నికైనదీ. దీంతో ఆనాటి నాగరికతలు సాంకేతికంగా పైచేయి పొందగలిగాయి.
భూమిలో ఇనుము సమృద్ధిగా లభిస్తున్నప్పటికీ దాని అధిక ద్రవీభవన స్థానం - 1,538 ° సెం (2,800 ° ఫా) - కారణంగా క్రీ.పూ రెండవ సహస్రాబ్ది చివరి వరకు ఇనుము వాడకం జరగలేదు. తగరం ద్రవీభవన స్థానం బాగా తక్కువ - 231.9 (సెం (449.4 ° ఫా). రాగి కూడా ఇనుము కంటే బాగా తక్కువ ఉష్ణోగ్రత వద్దనే కరుగుతుంది - 1,085 ° సెం (1,985 ° ఫా). క్రీ.పూ 6000 నాటి కొత్త రాతియుగపు బట్టీల ఉష్ణోగ్రత సామర్థ్యం 900 ° సెం (1,650 ° ఫా) కంటే ఎక్కువగానే ఉండేది. రాగి, తగరాలను కరిగించడానికి ఈ బట్టీల సామర్థ్యం సరిపోయేది.[1] రాగి-తగరపు ఖనిజాల లభ్యత తక్కువగా ఉండేది. క్రీ.పూ. మూడవ సహస్రాబ్దిలో కంచు వ్యాపారం ప్రారంభమయ్యే వరకు పశ్చిమ ఆసియాలో తగరపు కంచు లేకపోవడం దీన్ని బలపరుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కొత్త రాతి యుగం తరువాత కంచుయుగం వచ్చింది. ఈ రెండింటి సంధి కాలంలో రాగియుగం వచ్చింది. ఇనుప యుగం సాధారణంగా కంచుయుగాన్ని అనుసరించినప్పటికీ, కొన్ని ప్రాంతాలలో (ఉప-సహారన్ ఆఫ్రికా వంటి చోట్ల) ఇనుప యుగం క్రీ.పూ 2500 లోనే ప్రారంభమైంది.[2]
కంచుయుగ నాగరికతల్లో రాయడం మొదలవడం విభిన్న కాలాల్లో జరిగింది. పురావస్తు ఆధారాల ప్రకారం, మెసొపొటేమియా (క్యూనిఫాం స్క్రిప్టు), ఈజిప్టు (హైరోగ్లిఫ్సు) నాగరికతలు మొట్టమొదటి రాత వ్యవస్థలను అభివృద్ధి చేశాయి.