తిరుమల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి జిల్లా లోని హిందూ పుణ్యక్షేత్రం / From Wikipedia, the free encyclopedia
తిరుమల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలోని తిరుపతి పట్టణానికి ఆనుకొని ఉన్న కొండలపై గల హిందూ పుణ్యక్షేత్రం. ఇక్కడ గల వెంకటేశ్వర ఆలయం ఒక హిందూ ఆలయం. ఈ ఆలయం విష్ణువు రూపమైన వెంకటేశ్వరుడికి అంకితం చేయబడింది. కలియుగ కాలంలో పరీక్షలు, కష్టాల నుండి మానవాళిని రక్షించడానికి భగవంతుడు ఇక్కడ స్వయంగా వెలిసాడని నమ్ముతారు. అందువల్ల ఈ ప్రదేశానికి కలియుగ వైకుంఠం అనే పేరు కూడా వచ్చింది. ఇక్కడ ఉన్న భగవంతుడిని కలియుగ ప్రత్యక్ష దైవం అని, ఆలయాన్ని తిరుమల ఆలయం, తిరుపతి ఆలయం, తిరుపతి బాలాజీ ఆలయం అని, వెంకటేశ్వరుని బాలాజీ, గోవింద, శ్రీనివాస అనేక ఇతర పేర్లతో పిలుస్తారు.[3] ఈ ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యక్ష నియంత్రణలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) నిర్వహిస్తుంది, ఇది టిటిడి అధిపతిని కూడా నియమిస్తుంది, పుణ్యక్షేత్రం నుండి వచ్చే ఆదాయాన్ని ఉపయోగిస్తుంది.[4]
శ్రీ వేంకటేశ్వర ఆలయం, తిరుమల | |
---|---|
భౌగోళికం | |
భౌగోళికాంశాలు | 13°40′59.7″N 79°20′49.9″E |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తిరుపతి |
స్థలం | తిరుపతి |
ఎత్తు | 853 m (2,799 ft) |
సంస్కృతి | |
దైవం | వేంకటేశ్వరుడు (విష్ణు) |
ముఖ్యమైన పర్వాలు | బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి, రథసప్తమి |
వాస్తుశైలి | |
నిర్మాణ శైలులు | ద్రావిడ శైలి |
దేవాలయాల సంఖ్య | 1 |
శాసనాలు | కన్నడ, సంస్కృతం, తమిళం, తెలుగు[1] |
చరిత్ర, నిర్వహణ | |
సృష్టికర్త | వీర నరసింగదేవయాదవరాయ వీరరాక్షసయాదవరాయ రంగనాథయాదవరాయ[2] |
దేవస్థాన కమిటీ | తిరుమల తిరుపతి దేవస్థానములు |
తిరుమల కొండలు శేషాచలం కొండలు పరిధిలో భాగం. కొండలు సముద్ర మట్టానికి పైన 853 metres (2,799 ft) ఎత్తులో ఉన్నాయి. కొండలశ్రేణిలోగల ఏడు శిఖరాలు, ఆదిశేషుని ఏడు తలలను సూచిస్తాయి. ఈ ఆలయం పవిత్ర జలాశయమైన శ్రీ స్వామి పుష్కరిణి దక్షిణ ఒడ్డున ఏడవ శిఖరం వెంకటాద్రిపై ఉంది. అందువల్ల ఈ ఆలయాన్ని "ఏడు కొండల ఆలయం" అని కూడా పిలుస్తారు. తిరుమల పట్టణం విస్తీర్ణం సుమారు 10.33 sq mi (26.75 km2) .
ఈ ఆలయం నిర్మాణం ద్రావిడ శైలిలో సా.శ. 300 లో ప్రారంభమైందని నమ్ముతారు. తిరుమల తిరుపతిలో మొదటి ఆలయాన్ని పురాతన తోండైమండలం తమిళ పాలకుడు తొండమాన్ సా.శ. 8 వ శతాబ్దంలో గాలిగోపురం, ప్రాకారాన్ని నిర్మించాడని చెబుతారు.[5] [6] గర్భగుడిని ఆనందనిలయం అంటారు. ప్రధాన దేవుడు వెంకటేశ్వరుని విగ్రహం గర్భగుడిలో తూర్పు ముఖంగా నిలబడి ఉన్న భంగిమలో ఉంది. ఈ ఆలయం వైఖానస ఆగమ ఆరాధన సంప్రదాయాన్ని అనుసరిస్తుంది. ఇది ఎనిమిది విష్ణు స్వయంభు క్షేత్రాలలో ఒకటి. ఇది 108 దివ్యదేశాలలో చివరి భూసంబంధమైన దివ్యదేశంగా 106 స్థానంలో ఉంది. దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరూ శ్రీవారిని దర్శించి తరించారు. 9వ శతాబ్దానికి చెందిన పల్లవులు, 10వ శతాబ్దానికి చెందిన చోళులు (తంజావూరు), పాండ్య రాజులు (మదురై), 13-14 శతాబ్దానికి చెందిన విజయనగర రాజులు శ్రీవారికి విలువైన కానుకలు సమర్పించినట్లు శిలాశాసనాల ద్వారా తెలుస్తున్నది. విజయనగర రాజుల కాలంలో దేవాలయం ప్రాముఖ్యత పెరిగి, ఆలయ విస్తరణ జరిగింది. సతీ సమేతులైన శ్రీ కృష్ణదేవ రాయలు, రాజా తోడరమల్లు విగ్రహాలు ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి.
ఆలయ ప్రాంగణంలో యాత్రికుల రద్దీని నిర్వహించడానికి రెండు ఆధునిక వేచివుండే (క్యూ) భవనాలు ఉన్నాయి. ఇక్కడ యాత్రికులకు ఉచిత భోజనం కోసం తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం భవనం, తలనీలాలు సమర్పించు భవనాలు, అనేక యాత్రికుల బస స్థలాలు ఉన్నాయి.
అందే విరాళాలు, సంపద పరంగా ఇది ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయం.[7][8][9] ఈ ఆలయాన్ని ప్రతిరోజూ 50,000 నుండి 100,000 మంది యాత్రికులు (సంవత్సరానికి సగటున 30 నుండి 40 మిలియన్ల మంది) సందర్శిస్తారు. వార్షిక బ్రహ్మోత్సవం వంటి ప్రత్యేక సందర్భాలు, పండుగలలో, యాత్రికుల సంఖ్య 500,000 వరకు వుండి ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే పవిత్రమైన ప్రదేశమైంది.[10] 2016 నివేదిక ప్రకారం 27.3 మిలియన్ల మంది యాత్రికులు ఆలయాన్ని సందర్శించారు.[11]